ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డుల జోరుకు బ్రేకిచ్చాయి. గత రెండు సెషన్ల నుంచి లాభాల పంట పండించిన మార్కెట్లు, నేడు కాస్త రిలాక్స్ అయ్యాయి. ట్రేడింగ్ ముగింపు నాటికి మార్కెట్లు ఫ్లాట్గా నమోదయ్యాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంలో 37,665.8 వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల నష్టంలో 11,389.5 వద్ద క్లోజయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులను నెలకొల్పిన సంగతి తెలిసిందే. కానీ ఆ రికార్డులను మార్కెట్లు చివరి వరకు నిలుపుకోలేకపోయాయి.
ట్రేడింగ్ ప్రారంభంలో అన్ని రంగాల సూచీలు లాభాల్లో ఉండగా... ట్రేడింగ్ చివరికి మాత్రం బ్యాంక్లు, ఎనర్జీ, ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ షేర్లు టాప్ లూజర్లుగా నష్టాలు గడించాయి. మెటల్స్ మాత్రమే మెరుపులు మెరిపించాయి. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ లాభాల్లోనే నమోదైంది. టాటా స్టీల్, ఏసియన్ పేయింట్స్, టైటాన్ కంపెనీ నేటి ట్రేడింగ్లో ఎక్కువగా లాభపడగా.. అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా టాప్ లూజర్లుగా ఉన్నాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 22 పైసల లాభంలో 68.67 వద్ద నమోదైంది.